Pawan Kalyan says YS Jagan - Chandrababu Naidu  secrete friendsచంద్రబాబు నాయుడుకు జగన్ మోహన్ రెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంతటి వైరం ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కొంత నిగ్రహంగా ఉన్నా చాలా సందర్భాలలో జగన్ చంద్రబాబును నడిరోడ్డు మీద ఉరి తియ్యాలి, రాళ్ళ తో కొట్టి చంపాలి అనడం మనం అందరం చూశాం. అసలు చంద్రబాబు వయసుకు కూడా జగన్ మర్యాద ఇవ్వరు. అటువంటిది పవన్ కళ్యాణ్ ఒక కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబు జగన్ రహస్య మిత్రులట. రాష్ట్ర ప్రోజెక్టులన్నిటి లోనూ జగన్ కు వాటాలు వెళ్తున్నాయట.

నిన్న పి. గన్నవరంలో రాష్ట్రంలో నిర్మించే ప్రతి ప్రాజెక్టు నుంచి జగన్‌కి వాటాలు వెళ్తున్నాయని, అవి సక్రమంగా చేరేలా చంద్రబాబు బాధ్యత తీసుకుంటున్నారని జనసేన అధినేత ఆరోపించారు. ఇదంతా ఏదో సినిమా కథ లా ఉంది. బహుశా సినిమాలను వదిలినా ఆ ప్రభావం ఇంకా పవన్ కళ్యాణ్ పోలేదు అనుకుంటా. వైకాపా వారు గత నాలుగున్నర ఏళ్ళగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టును ఆపడానికి కోర్టుకు వెళ్ళారు. వాటాలో దక్కే పనైతే ఎందుకు ఆపాలని అనుకుంటారు.

అధికారంలో ఉండే ఏ పార్టీ అయినా సహజంగా ప్రత్యర్థి పార్టీ ఆర్ధిక మూలలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. అంతెందుకు ఇటీవలే టీడీపీ ఎన్డీయే నుండి బయటకు వచ్చాక టీడీపీకి ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలిచే నేతలను మోడీ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. అదేంటో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం కొత్త భాష్యం చెబుతున్నారు. అయితే ఎప్పటిలానే గుడ్డ కాల్చి మీద వేసిపోతారు ఆరోపణలకు ఎటువంటి రుజువులు చూపించకుండా అని రెండు పార్టీల వారు అంటున్నారు.

గత కొద్దీ రోజులుగా ఎందుకో తెలీదుగానీ పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డిని బాగా టార్గెట్ చేస్తున్నారు. “ఈ మధ్య వైకాపాను విమర్శిస్తున్నానని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మీ నేత చట్టసభలకు వెళ్లి అవినీతిపై ప్రశ్నించకపోతే ఏంచేయమంటారు. ముందు ఆయన్ని అక్కడకు వెళ్లమనండి” అని సూచించారు. నాలుగున్నర ఏళ్ళగా పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వాన్ని ఏదో అడపాదడపా తప్ప ప్రభుత్వాన్ని పెద్దగా ఇరుకున పెట్టింది లేదు మా నాయకుడు ఎప్పుడు ప్రజల మధ్యే ఉండి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నాడు అంటున్నారు వైకాపా వారు.