Pawn Kalyan responds over comments on tollywood-హైదరాబాద్ లో వర్షాల కాలంలో జనజీవితం అస్తవ్యస్తం అయ్యింది. చాలా లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. చాలా మంది ప్రజలు నిలువనీడ లేకుండా అయిపోయారు. తినడానికి తిండి లేకుండా ప్రభుత్వ సాయం… దాతల సాయం కోసం ఆశగా వేచిచూసే పరిస్థితి. ఈ తరుణంలో కొందరు చిత్ర పరిశ్రమ ప్రముఖులు విరివిగా విరాళాలు ఇచ్చారు.

అయితే ఎటువంటి విపత్తు వచ్చినా ముందు చిత్ర పరిశ్రమ ఏమి ఇచ్చింది? ఇస్తే సరిపడినంత ఇచ్చారా అనే చర్చ మొదలవుతుంది. దీనిమీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. “ప్రతి వారికీ చిత్ర పరిశ్రమ వారు సాఫ్ట్ టార్గెట్ అవుతారు. అలా అడిగే వారు కనీసం పది రూపాయిలు ఇచ్చారా?,” అని ఆయన ప్రశ్నించారు.

“ఎంతైనా డబ్బు ఇవ్వాలంటే గొప్ప మనసుండాలి. చిత్ర పరిశ్రమలోని హడావిడి వల్ల ఉన్నదాని కంటే ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. ఇక్కడ కోటి రూపాయిలు సంపాదిస్తే టేబుల్ మీదకు వచ్చేది 50 లక్షలే. డబ్బు ఉన్నదంతా రాజకీయ నాయకుల వద్ద… రియల్ ఎస్టేట్ వారి వద్ద ఉంది. ఎన్నికలలో గెలిచిన ఓడిపోయిన రాజకీయ నాయకులు పెట్టుబడి అనుకునైనా ఇప్పుడు విరాళాలు ఇవ్వాలి,” అని ఆయన అన్నారు.

“మామూలుగానే విరాళాలు అడగడం తప్పు. పైగా ఇది కరోనా సమయం అందరికీ ఇబ్బంది గానే ఉంది. ఇప్పుడు ఇవ్వడం కూడా కష్టమే. అయినా ఇవ్వడం అంటే గొప్ప విషయం. తెలంగాణలో ఒక ప్రో-యాక్టీవ్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు పని చేసి అడగడం తో అంతా ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలా సమాజంలోని ప్రముఖులను అడగాలి,” అని పవన్ చెప్పుకొచ్చారు.