పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన “సత్యాగ్రహి” సినిమా గుర్తుందా..? పవన్ స్వీయ దర్శకత్వంలో తమిళ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ స్థాయిలో నిర్మిస్తానని ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమాకు ఆదిలోనే బ్రేకులు పడడంతో, అప్పటినుండి ఇప్పటివరకు ‘సత్యాగ్రహి’ అడ్రస్ గల్లంతయ్యింది. ఆ సినిమానే కాదు, ఏకంగా నిర్మాత రత్నం కూడా సినిమాలకు దూరంగా జరిగారు. కొడుకును హీరోగా ప్రమోట్ చేయాలనుకున్న ఫలితం సక్సెస్ కాకపోవడంతో, మళ్ళీ సినీ నిర్మాణాల వైపుకు మొగ్గుచూపుతున్నారు.
అయితే అప్పుడెప్పుడో వదిలేసిన ‘సత్యాగ్రహి’ కాంభినేషన్ మళ్ళీ కార్యరూపం సిద్ధించుకోబోతోందని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ బిఎ రాజు తెలిపారు. అజిత్ హీరోగా తమిళంలో సూపర్ హిట్ అయిన “వేదాలం” సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఏ.ఎం.రత్నం నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారంటూ రాజు గారు తాజాగా ఓ ట్వీట్ సమాచారం అందించారు. నిజానికి పవన్ కళ్యాణ్ – వేదాలం రీమేక్ వార్తలు ఇప్పటివి కావు. చాన్నాళ్ళుగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని పవన్ ఉత్సాహంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం పవన్ ఉత్సాహానికి నిర్మాత లభించినట్లయ్యింది. మరి దర్శకుడు ఎవరన్న ఆలోచన అభిమానులకు కలగడం సహజమే. అయితే, పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకుడితో పనేముందిలే..! అంటే… దర్శకుడు పేరుతో సంబంధం లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎప్పుడూ ఎనలేని క్రేజ్ అభిమాన వర్గాల్లోనూ… ట్రేడ్ సర్కిల్స్ లోనూ ఉంటుంది కదా… అదన్నమాట..!