Pawan Kalyan planning a television showప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు మరియు ప్రజా సమస్యలను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పేందుకు “సత్యమేవ జయతే” టీవీ షో ద్వారా ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ అమీర్ ఖాన్ చేసిన ప్రయత్నం తెలిసిందే. దేశవ్యాప్తంగా సూపర్ హిట్ గా నిలిచిన ఈ షోను ఓ ప్రముఖ మీడియా ఛానల్ తెలుగులోకి డబ్ కూడా చేసి ప్రసారం చేసింది. ఈ టీవీ షో ప్రేరణతో తాజాగా ‘జనసేన’ అధినేత కూడా బుల్లితెరపై ఇలాంటి ప్రయత్నమే చేయబోతున్నారని తెలుస్తోంది.

జనసేన పార్టీ వర్గాలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ధృవీకరించిన ఈ విషయం, ఎప్పటినుండి ప్రసారం అవుతుందో అన్నది మాత్రం తేలాల్సి ఉంది. బహిరంగ సమావేశాలలో మాట్లాడుతూ మాట్లాడుతూ… ఊగిపోయే పవన్ కళ్యాణ్, ఇకపై బుల్లితెరపై ఊగిపోవడానికి, తన అభిమానులను ఊపేయడానికి సిద్ధమవుతున్నాడన్న మాట. అయితే సోషల్ మీడియాలో ఈ షోపై అప్పుడే భిన్న వాదనలు మొదలయ్యాయి.

పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఎక్కువ శాతం రీమేక్ సినిమాలు కాగా, ఇప్పుడు ఈ షో కూడా రీమేక్ యేనా? అన్న విమర్శలు ఓ పక్కన వినిపిస్తుండగా, రాజకీయాల ద్వారా ఏమీ చేయలేకపోతున్నా, కనీసం ఈ షో ద్వారా అయినా ప్రజలకు ఎంతో కొంత మంచి జరుగుతుందని ఆశించే వారున్నారు. మరి ఈ షోను ఎలా ముందుకు తీసుకువెళ్తారో, తన రాజకీయ జీవితానికి ఎలా అనుకూలంగా మలచుకుంటారో గానీ, ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.