ఎప్పుడో చెలరేగిన పుకారుపై జనసేన అధినేత తాజాగా స్పందించడంతో “పరిటాల రవి – పవన్ కళ్యాణ్ – గుండు” అంశం హాట్ టాపిక్ గా మారింది. తన సైడ్ నుండి పవన్ వివరణ ఇచ్చుకున్నారు సరే, మరి పరిటాల రవి సైడ్ నుండి ఎవరు వివరణ ఇస్తారు? ఎవరు ఇచ్చినా నమ్మే పరిస్థితి నెలకొందా? అంటే లేదనే చెప్పాలి. అయితే గతంలో స్వయంగా పరిటాల రవినే ఈ అంశంపై స్పందించారు.
పవన్ తాజా ప్రస్తావనతో సదరు వీడియో మళ్ళీ సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. నాడు మీడియాతో పరిటాల రవి పంచుకున్న విషయాలు గమనిస్తే… హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని తన ఇంటి పక్కన స్థలం కొనుగోలు చేయాలని చిరంజీవి అనుకున్నారని, దీంతో వద్దని ఆయనను వారించానని పరిటాల పేర్కొన్నారు.
తనకు భద్రతాపరమైన సమస్యలు ఉండడంతో వచ్చీపోయే వాహనాలను తన వాళ్లు ఆరా తీస్తుంటారని, అది చిరంజీవికి, ఆయన కోసం వచ్చే వారికి ఇబ్బందిగా మారే అవకాశం ఉండడంతో ఆ స్థలాన్ని కొనుగోలు చేయవద్దని సలహా ఇచ్చానని వివరించారు. చిరంజీవి కూడా అర్థం చేసుకుని ఆ స్థలాన్ని కొనుగోలు చేయలేదని చెప్పారు.
అంతే తప్ప చిరంజీవి కుటుంబంలో ఎవరితోనూ తనకు సమస్యలు లేవని చెప్పుకొచ్చారు. చివరిగా పవన్ కల్యాణ్ గుండు గురించి మాట్లాడుతూ.. పవన్తో తనకు పరిచయం లేదని, బహుశా తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించి ఉంటారని తేల్చిచెప్పారు. అది తెలియక, తానంటే గిట్టనివారు తానే అతడికి గుండు కొట్టించానని ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.