జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే పెన్షన్లు పెంచిన చంద్రబాబు నాయుడును ఆయన టార్గెట్ గా చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రజలకు కావల్సింది రెండు వేల రూపాయల పెన్షన్ , ఇరవై ఐదు కిలోల బియ్యం కాదని ,పాతికేళ్ల బంగారు భవిష్యత్తు అని ఆయన అంటున్నారు. అయితే ఇది వినడానికి బానే ఉంది గానీ అర్ధం లేనిదని తెలుగు దేశం సమర్ధకులు విమర్శిస్తున్నారు. సామాజిక బాధ్యత పెన్షన్లు అనేవి అశక్తులకు ప్రభుత్వం ఇచ్చే అండా.
ముసలి వాళ్లకు, వితంతువులకు, వికలాంగులకు, వయసు మళ్లిన కొందరి కార్మికులకు, కళాకారులకు, రెండు చేతులు లేని వారికి, కిడ్నీ జబ్బులతో బాధ పడుతున్న వారికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది. వారికి ఆసరా ఇవ్వడమే కదా బంగారు భవిష్యత్తు అంటే? వీరిలో కిడ్నీ జబ్బులతో బాధ పడేవారికి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది అప్పట్లో పవన్ కళ్యాణే. ఇప్పుడు ప్రజలకు పెన్షన్లు కోరుకోవడం లేదని ఆయన అనడం ఏంటో మరి. పవన్ కళ్యాణ్ లో ఇటువంటి నిలకడలేనితనం అప్పుడప్పుడు కనిపించేదే.
అయితే పెన్షనలు వంటి సెన్సిటివ్ విషయం మీద స్పందించేటప్పుడు కొంత అలోచించి మాట్లాడితే మంచిది. లేకపోతే పెన్షన్లు పెంచడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని వేరే పార్టీలు ప్రచారం చేసినా చేస్తాయి. దీని వల్ల జనసేన పార్టీకి భారీ నష్టం జరగవచ్చు. దీని కారణంగానే ఈ విషయంపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ గట్టిగా స్పందించలేకపోతుంది. ఇప్పుడిప్పుడే రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఇది కొత్త. చుట్టూ ఉండే నాదెండ్ల మనోహర్ లాంటి వారైనా ఈ విషయంలో జాగ్రత్త పడాలి.