ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానికులకు భూములివ్వకుండా ఫ్రాంక్లిన్ సంస్థకు ఇచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోను ఏపీ మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ… దానికి బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలు సృష్టించాలనుకుంటే వారికి ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలుకుతామని ట్వీట్ చేశారు. అటువంటి వారిని తాను స్వయంగా ఆహ్వానించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నానని చెప్పారు.
అయితే ప్రభుత్వం ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వలేదని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటని లోకేశ్ చెప్పారు. 450 కోట్ల పెట్టుబడి పెట్టి 2400 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోందని, స్థానిక పారిశ్రామిక వేత్తలకు అన్యాయం జరుగుతోందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో పల్సస్ టెక్ సంస్థకు భూమి కేటాయించామని, ఆ కంపెనీ సీఈవో శ్రీనిబాబుది శ్రీకాకుళమేనని అన్నారు. అవగాహన లేకుండా విమర్శలు చేయవద్దని పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు లోకేష్ ఈ వీడియోతో సమాధానం చెప్పారు.