జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా మంగళగిరి పార్టీ ఆఫీసులో బస చేశారు. ఇటీవలే ఎన్నికలలో ఘోరపరాజయం గురించి రివ్యూ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి కమిటిలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను కలవడానికి చుట్టుపక్కల నుండి పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు పార్టీ ఆఫీసుకు తరలి వస్తున్నారు. వారందరితో ఓపిగ్గా మాట్లాడి ఫోటోలకు ఫోజులిస్తున్నారు జనసేనాని. ఇలా ఉండగా ఈరోజు పవన్ కళ్యాణ్ ను ఒక జంట కలిసింది.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అంకమ్మ రావు, ఇందిరా దంపతులు పవన్ కళ్యాణ్ వీరాభిమానులు. వారికి ఇటీవలే పాప జన్మించడంతో ఆ పాపను తీసుకుని పార్టీ ఆఫీసుకు వచ్చారు. తమ ముద్దుల తనయకు పవన్ కళ్యాణే పేరు పెట్టాలని వారు కోరగా, జనసేనాని ఆ పాపను ముద్దాడి ఆమెకు వేద వినీషా అనే పేరు పెట్టారు. దీర్గాయుష్మాన్ భవ అని పాపని ఆశీర్వదించారు పవన్ కళ్యాణ్. దీనితో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు.
మరోవైపు గత కొంత కాలంగా పార్టీని వీడతారని ప్రచారం జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, పార్టీలో నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశాలకు హాజరు కావడంతో పార్టీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే ఎన్నికలలో పార్టీ కోసం పని చేసిన నాయకులను, క్యాడర్ నూ కలిసే ఉద్దేశంలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ విషయంగా వారికి సమాచారం ఇచ్చి తొందరలో కలవడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించబోతుంది పార్టీ.