జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు మనవరాలు, దివంగత సుమన్, విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహాన, వినయ్ల వివాహనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకోవడం పలువురిని ఆకర్షించింది. మొన్న ఆ మధ్య వడదెబ్బతో ఇబ్బంది పడిన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి చంద్రబాబు వాకబు చేశారు.
ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే గత సంవత్సరం జూన్ లో అమరావతిలో జరిగిన దశావతార వెంకటేశ్వర స్వామి గుడి విగ్రహ ప్రతిష్టకు వారిద్దరూ హాజరు అయ్యారు. అయితే ఆ సమయంలో వారిద్దరూ కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. కనీసం మర్యాద కోసమైనా పలకరించుకోలేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపాలి, ఆయనకు పెన్షన్ ఇవ్వాలి అంటూ ఎద్దేవా చేసే వారు.
ఇప్పుడు ఎన్నికలు పూర్తి అవ్వడంతో మర్యాదలు కూడా తిరిగి వచ్చాయి. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి పవన్ చంద్రబాబు కలిసి ఆడిన నాటకమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వారిద్దరూ రహస్య స్నేహితులని తాము చేసిన ఆరోపణలు నిజం అయ్యాయని వారు అంటున్నారు. మరోవైపు ఈ వివాహ మహోత్సవానికి ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. అయితే ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి మాత్రం హాజరు కావడం విశేషం.