త్వరలో క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్న ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత తదుపరి చిత్రాన్ని పవన్ చేస్తారా? లేదా? అన్న దానికి సమాధానం ట్రేడ్ వర్గాలలో లభిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు మరో సినిమాను చేయాలనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఇప్పటికే దానికి సంబంధించిన చర్చలు పూర్తయినట్లుగా తెలుస్తోంది.
‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ వంటి సినిమాలతో టాలీవుడ్ లో తమ మార్క్ ను ప్రజెంట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవన్ తో ఈ సినిమా చేయబోతుందని సమాచారం. పవర్ స్టార్ కు ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన హరీష్ శంకర్, ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కిందని, దీంతో మరోసారి హరీష్ నక్కతోక తోక్కినట్లయ్యిందని సినీ వర్గాలలో హల్చల్ చేస్తున్న టాక్. ఈ సినిమా పవన్ చేస్తున్నారని చెప్పడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది.
పవన్ తాము ఓ సినిమాను నిర్మిస్తున్నట్లుగా గతంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగానే వెల్లడించింది. ఇది చెప్పి దాదాపుగా ఏడాది గడుస్తున్నా… మరోవైపు సదరు సంస్థ ప్రస్తుతం రామ్ చరణ్ తో “రంగస్థలం” మరియు నాగచైతన్యతో “సవ్యసాచి” సినిమాను నిర్మించే పనిలో ఉంది. అలాగే మహేష్ తో మరో సినిమాను ప్లాన్ చేస్తోంది. టాప్ హీరోల డేట్స్ ను దక్కించుకోవడంలో విజయవంతం అయిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవన్ తో నిర్మిస్తే, ఎన్నికల ముందు పవన్ నటించే చివరి చిత్రం ఇదే కానుంది.