pawan-kalyan-kcrతెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ – జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికపైకి రాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. అయితే, రాజకీయ వేదికపైకి మాత్రం కాదు, ఒక సినీ ఆడియో వేడుక సందర్భంగా పవన్, కేసీఆర్ లు ఈ నెల 18వ తేదీన కలవబోతున్నారని ఈ వార్తల సారాంశం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా నటిస్తున్న “జాగ్వార్” ఆడియో వేడుకకు ప్రత్యేక అతిధులుగా పవన్, కేసీఆర్ లను ఆహ్వానించడంతో, ఈ ఇద్దరు దిగ్గజాలు హాజరయ్యే అవకాశం ఉందంటూ ట్రేడ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

తన కుమారుడి తెరంగ్రేటం ఓ రేంజ్ లో ఉండాలని భావించిన కుమారస్వామి, అందుకు అనుగుణంగానే గతంలో పవన్ ఆశీస్సులు తీసుకున్న వైనం తెలిసిందే. దీంతో ఈ వేడుకకు పవన్ హాజరు నూటికి నూరు శాతం పక్కా అని టాక్. అలాగే కుమారస్వామి ఆహ్వానం మేరకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయితే, పవన్ – కేసీఆర్ లు ఒకే వేదికపై కలవడం తొలిసారవుతుంది. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న ఈ ఆడియో వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ప్రత్యేక పాటలో కనువిందు చేయనున్న విషయం తెలిసిందే.