శుక్రవారం నాడు కాకినాడ, జేఎన్టీయూ క్రీడా మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పేరు ఉభయ గోదావరి జిల్లాలలో మారుమ్రోగుతోంది. ఎంతగా అంటే… రేపు సభ కోసం గురువారం సాయంత్రమే కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ను వీక్షించడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో పవన్ బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్నారు. పవన్ ను చూసేందుకు ఎగబడ్డ జనాలను నియత్రించడం పోలీసుల వల్ల కాకపోవడంతో ఒకానొక దశలో స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది.
కాకినాడ, జీఆర్టీ హోటల్ లో బస చేసిన పవన్ వద్దకు మీడియా వర్గాలను కూడా అనుమతించకపోవడంతో, విచ్చేసిన అభిమానులకు కూడా పవన్ దర్శన భాగ్యం పెద్దగా లభించలేదు. ఇటీవల తిరుపతి హోటల్ వద్ద కూడా ఇలాంటి ఉధృతే ఉండడం వలన, ఒకానొక దశలో పవన్ క్రింద పడబోయిన విషయం తెలిసిందే. ఈ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకునే, పోలీసులు లాఠీఛార్జ్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే రేపు పవన్ ‘ప్రత్యేక హోదా’పై ఏం మాట్లాడతారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఓ పక్కన ప్రతిపక్ష పార్టీ 10వ తేదీన బంద్ కు పిలుపు ఇవ్వడంతో, దీనిపై కూడా పవన్ కామెంట్ చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే… వైసీపీ మనుగడను కూడా పవన్ ప్రశ్నార్ధకం చేసే అవకాశం లేకపోలేదంటూ విశ్లేషణలు ఊపందుకున్నాయి. సాధారణంగా బంద్ తదితర నిరసనలకు పవన్ దూరం. ఇలాంటి సంఘటన వలనే గతంలో తెలంగాణా ఉద్యమ సమయంలో రాష్ట్రం ఓ పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ‘ప్రత్యేక హోదా’పై పవన్ స్పందన రాష్ట్ర ప్రజలలో ఒక స్పష్టత తెచ్చే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.