తమ పార్టీలోకి రావడానికి చాలామంది ఉన్నారు.., కానీ జనసేన అలాంటి వారిని ప్రోత్సహించదు.., ఇప్పటివరకు మీరు చూసిన రాజకీయాలు వేరు.., ఇక నుండి జనసేన చేయబోతున్న రాజకీయాలు వేరు.., ఆదర్శవంతమైన రాజకీయాలను చేసి చూపించి, రాజకీయాలలో సమూల మార్పుకు జనసేన శ్రీకారం చుడుతుంది… ఇవి పార్టీ స్థాపించిన తొలినాళ్ళల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.
కట్ చేసి వర్తమానంలోకి వస్తే… తమ పార్టీలోకి రావడానికి 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు… వారందరూ ఇప్పటికే పవన్ తో చర్చలు జరిపారు, వారంతా పార్టీలో వచ్చే తేదీని ఖరారు చేసి పవన్ ముహూర్తం ప్రకటించడమే తరువాయి… అంటూ జనసేన పార్టీ కన్వీనర్ వి.పార్ధసారధి ఓ అధికారిక ప్రకటన చేసారు. అంటే అతి త్వరలోనే జనసేనలోకి వెళ్ళాలనుకునేవారికి ద్వారాలు తెరుచుకొబోతున్నాయన్నమాట.
రాజకీయ విలువలకు కట్టుబడిన వారిని మాత్రమే తీసుకుంటామని జంపింగ్ లపై ఓ బహిరంగ సభలో పవన్ స్పష్టంగా తెలిపారు. మరి పవన్ కు తెలిసిన రాజకీయ విలువలు ఏమిటో, అవి పాటించే నాయకులు ఎవరో పూర్తిగా తెలియాలంటే… పార్ధసారధి గారు చెప్పినట్లు పవన్ ముహూర్త సమయం ప్రకటించాలన్న మాట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… ప్రస్తుత జనసేన పరిస్థితి చూసి పార్టీలోకి వచ్చేవారుంటారా?!