Pawan Kalyan JanaSena Telangana Politicsజనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ ఎందుకోగానీ తెలంగాణలో సమస్యలపై పోరాడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే చేసిన సుడిగాలి పర్యటన సందర్భంగా తొందరలో తెలంగాణాలో పర్యటించబోతున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు గజ్వెల్ వెళ్లాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో అనుకోని కారణాల వల్ల ఈ పర్యటన కేన్సెల్ అయ్యిందని జనసేన పార్టీ తెలిపింది. గత మూడు సంవత్సరాలుగా తెలంగాణా సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందించింది లేదు.

అక్కడి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అన్నది లేదు. దానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలీదు. అటువంటి విమర్శలు వస్తున్నప్పుడు మాత్రం త్వరలో తెలంగాణా వెళ్తున్నట్టు చెప్పడం తరువాత దానిని కేన్సెల్ చేసుకోవడం పరిపాటు అయిపోయింది. 2019 ఎన్నికలలో జనసేనకు తెలంగాణాలో పోటీ చేసే ఉద్దేశం లేదా?

ఆంధ్రప్రదేశ్ లోనే పార్టీ నిర్మాణం ఇంకా జరగలేదు అనుకుంటే తెలంగాణాలో పార్టీ పరిస్థితి ఇంకా అస్తవ్యస్తంగా ఉంది. బహుశా జనసేన పార్టీ హైదరాబాద్ లో పోటీకి మాత్రమే పరిమితం కావొచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్ననే తన తదుపరి చిత్రం అజ్ఞాతవాసి డబ్బింగ్ మొదలు పెట్టారు.