Pawan Kalyan Praja Yatra in Khammam ఈ ఉదయం కొత్తగూడెం నుంచి ఖమ్మంకు ర్యాలీగా బయలుదేరిన పవన్ కల్యాణ్, మార్గమధ్యంలోని దంతాలపల్లిలో కాసేపు సేదదీరారు. తన వెంట కాన్వాయ్ గా బయలుదేరిన వందలాది బైకులను మార్గమధ్యంలో పోలీసులు విడతల వారీగా వేరుచేయగా, వేగంగా వెళ్లిపోయిన ఆయన దంతాలపల్లి శివారులో కారును ఆపించారు. ఆ వెంటనే చుట్టు పక్కల ఉన్నవారు పవన్ ను చూడగానే పరుగులు తీస్తూ వచ్చారు.

పవన్ తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపగా, వారితో పవన్ కాసేపు మాట్లాడి సెల్ఫీలకు పోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ యువకుడు పవన్ తో మాట్లాడుతూ, తెలంగాణలో మీకు భారీగా అభిమానులు ఉన్నారని చెప్పడంతో చిరునవ్వు నవ్వారు. తమ ఫేవరెట్ హీరో అక్కడున్నాడన్న సంభ్రమాశ్చర్యాల నుంచి వారు తేరుకోకముందే, అక్కడ జనాలు పోగవుతుండటంతో పవన్ కల్యాణ్ తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు.