జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలు సమీపించడంతో ప్రచారం ముమ్మరం చేశారు. వెళ్లిన ప్రతీ చోటా చంద్రబాబు, జగన్ కుటుంబాలే రాజకీయాలు చెయ్యాలా? వారికి మద్దతు ఇచ్చే కుటుంబాల వారు వారి వారసులే రాజకీయ నాయకులు అవ్వాలా? సామాన్య ప్రజలకు చోటు లేదా అని చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే జనసేన కూడా అందుకు మినహాయింపు కాదని రుజువు చేసింది. కేవలం మంచి అభ్యర్థులు దొరకని చోటే యువరక్తం అంటూ సీట్లు ఇచ్చారని కొందరు ఆరోపిస్తున్నారు.
దీనికి ఉదాహరణ కర్నూల్ జిల్లాలో ఆ పార్టీ సీట్ల పంపకం. ఒకరో ఇద్దరో.. మహా అయితే ముగ్గురు..! ఒకే కుటుంబం నుంచి ఇంతకంటే ఎక్కువ మందికి ఒకే ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం రాదు. కానీ.. ఎస్పీవై రెడ్డి కుటుంబం ఈ రికార్డును బ్రేక్ చేసింది. అదికూడా ఒకే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతోంది. వీరికి జనసేన పార్టీ ఏకంగా నాలుగు టికెట్లిచ్చింది. ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులు పోటీ చెయ్యడం విశేషం.
నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఆయన చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి శాసనసభ అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్రెడ్డి నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేస్తున్నారు. 2014లో వైకాపా టిక్కెట్ మీదే ఎన్నికైన ఎస్పీవై రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడో రోజునే టీడీపీలో చేరిపోయారు. కాకపోతే ఆ పార్టీ ఆయన అడిగినన్ని టిక్కెట్లు ఇవ్వకపోవడంతో అలిగి పవన్ కళ్యాణ్ వద్దకు చేరారు. రాజకీయంగా పేరు ఉన్న కుటుంబం కావడంతో పవన్ కళ్యాణ్ వారికి అడిగినన్ని టిక్కెట్లు ఇచ్చేశారు.