జనసేన పార్టీ ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. అయితే దానిని కప్పిపుచ్చి తమకు మొత్తంగా 27 శాతం ఓట్లు వచ్చాయని… 1209 సర్పంచులు, 1576 ఉప సర్పంచులు, 4456 వార్డులు గెలిచాం అని కాకి లెక్కలతో తమను తాము మోసం చేసుకుంది ఆ పార్టీ. అయితే పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావు కాబట్టి సరిపోయింది.
అయితే ఆ పార్టీ డొల్లతనం మునిసిపల్ ఎన్నికలలో బయటపడుతుంది. పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి దాయడం కష్టం. నామినేషన్ల విరమణ సమయం పూర్తయ్యాకా…. జనసేన బలంగా ఉండాల్సిన తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీ కేవలం 75 వార్డుల లో పోటీలో నిలిచింది. మిత్రపక్షం బీజేపీ మరో 35 వార్డులలో పోటీ ఉంది.
ఏకగ్రీవాల తరువాత 261 వార్డులలో ఎన్నికలు ఉన్నాయి. అంటే జనసేన, బీజేపీ కలిసి కనీసం సగం వార్డులలో పోటీ చెయ్యలేకపోయింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సొంతంగా 201 చోట్ల పోటీలో ఉంది. కొన్ని చోట్ల మిత్రపక్షాలకు కూడా ఇచ్చింది. తూర్పు గోదావరి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే చోటు. అక్కడ సహజంగా జనసేనకు పట్టు ఉండాలి.
2019 ఎన్నికలలో జనసేన గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు ఈ జిల్లా నుండే… అటువంటి చోట పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూర్చుని సమీక్షించుకోవాలి. ఎన్నికలు పూర్తయ్యి రెండేళ్లయినా పరిస్థితిలో ఏ మార్పు లేకపోవడం దారుణం అనే చెప్పుకోవాలి.