అందుతున్న తాజా సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు శ్రీకాకుళంలో నిరాహారదీక్షకు కూర్చోబోతున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ఆరోపణతో పవన్ కళ్యాణ్ దీక్షకు కూర్చుంటున్నారని సమాచారం. ఇది ఒక రోజు దీక్ష అని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
48 గంటల్లో పూర్తి స్థాయి వైద్యమంత్రిని నియమించి, ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చర్యలు చేపట్టిందో వివరించడం వరకే చెయ్యడంతో పవన్ కళ్యాణ్ దీక్షకు కూర్చుంటున్నట్టు సమాచారం.
దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇప్పటికే అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్షకు కూర్చుంటా అని బెదిరించినా ఇదే మొదటిసారి ఆయన కూర్చోవడం. ఈ దీక్షకు సంబంధించిన ప్రకటన కాసేపట్లో జనసేన పార్టీ చేయ్యవచ్చని సమాచారం.