శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈరోజు ప్రారంభమైన జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్కల్యాణ్ తొలి దశలో 45 రోజుల పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో తిరుగుతారు. బస్సు యాత్ర చేపడతారని తొలుత ప్రచారం సాగినా ఆ తర్వాత పోరాటయాత్రగా ప్రకటించారు. దీనికి కూడా ఒక కారణం ఉందట.
బస్సుయాత్ర కేవలం ప్రసంగాలకే పరిమితమని, జనంతో మమేకమయ్యే అవకాశం ఉండదని.. అలాగని పూర్తి స్థాయి పాదయాత్ర చేయడానికి అభిమానుల తాకిడితో సాధ్యం కాకపోవచ్చనే ఉద్దేశంతోనే దీన్ని పోరాటయాత్రగా రూపకల్పన చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాంధ్ర పర్యటన తరువాత పవన్ చిన్న బ్రేక్ తీసుకుంటారని సమాచారం.
కొంత బస్సులో తిరుగుతారు. రోడ్డు షోలు నిర్వహిస్తారు. అక్కడక్కడా బహిరంగ సభలు కూడా పెడతారు. ప్రధానంగా సమస్యలపై దృష్టి సారించి లోతు పరిశీలనతో మేనిఫెస్టో కమిటీతో కలిసి పరిష్కార మార్గాలపైనా అవగాహన పెంచుకునేలా ఈ యాత్రను మలుచుకోవాలని యోచిస్తున్నారు.