రాష్ట్రంలో నామినేషన్ల పర్వం పూర్తి అయ్యింది, నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. రేపటితో నామినేషన్ల విత్ డ్రాకు చివరి గడువు. అన్ని పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లు ఇప్పటికే రాష్ట్రమంతా హెలీకాఫ్టర్లలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సభలు, ర్యాలీలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, వైకాపా టీవీలలో తమ ప్రకటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటనలు ప్రజలలో మంచి స్పందన వస్తుంది.
వైకాపా యాడ్లలో కొంత క్వాలిటీ తక్కువైనా ప్రచారంలో మాత్రం వెనుకబడటం లేదు. మొదట్లో సాక్షిలో మాత్రమే వీటిని ప్రసారం చెయ్యగా ఆ తరువాత తన తప్పు తెలుసుకుని అన్ని ఛానెళ్లలకు ప్రకటనలు ఇచ్చారు జగన్. అయితే ఈ విభాగంలో జనసేన పూర్తిగా వెనకబడింది ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు ఆలస్యంగా మేలుకొని హడావిడిగా కొన్ని ప్రకటనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంబంధాలతో తక్కువ టైం లో కూడా పవన్ కళ్యాణ్ వీటిని సిద్ధం చేయిస్తున్నారు.
రెండు మూడు రోజులలో ఇవి టీవీలలో వస్తాయని సమాచారం. ఈ వార్తతో ఆ పార్టీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మొట్టమొదటి సారి ఎన్నికలలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ వామపక్షాలు, బీఎస్పీ పార్టీలతో కలిసి ఈ ఎన్నికలలో పోటీ చేస్తుంది. అన్ని పార్టీలు కలిపి మొత్తం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలలో అభ్యర్థులను పట్టినా ప్రధానంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల మీదే పవన్ కళ్యాణ్ ఆశలన్నీ ఉన్నాయి. సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా హంగ్ వచ్చి జనసేన నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.