Pawan Kalyan Jana Sena only contesting for 2019 Elections2019 ఎన్నికలకు సెమీ ఫైనల్ గా పరిగణిస్తున్న నంద్యాల ఉప ఎన్నికలలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఎటు వైపు నిలవబోతున్నారు? గత సార్వత్రిక ఎన్నికలలో తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలిపిన పవన్ కళ్యాణ్, అదే బాటలో పయనిస్తూ తెలుగుదేశం పార్టీకి పచ్చజెండా ఊపుతారా? లేక వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అంటూ పరోక్షంగా వైసీపీకి దోహదం చేస్తారా? లేక ఎవరికీ మద్దతు తెలుపకుండా తటస్థంగా ఉంటారా? దీనిపై పొలిటికల్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పొలిటికల్ టాక్ ప్రకారం అయితే…. నంద్యాల ఉపఎన్నికలతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం అధికార వర్గానికి అనుకూలంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అక్టోబర్ నుండి ప్రజల్లోకి వస్తానని చెప్పడంతో, టిడిపికి మద్దతు ప్రకటిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో పవన్ ప్రస్తుతానికి తటస్థంగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదన్న భావన కూడా బలంగానే వ్యక్తమవుతోంది. పొలిటికల్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ అంశానికి ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ నుండి ప్రకటన వచ్చేసింది.

“నంద్యాల ఉప ఎన్నికల్లో తాము తటస్థంగా ఉండనున్నామని” జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. తమ పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, ఎవరికో తాము మద్దతు ఇస్తున్నట్టు వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సంద్భంగా తెలిపారు. 2019 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళతామని, అప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ‘జనసేన’ మద్దతు ఉండదని స్పష్టం చేశారు. దీంతో ఇక్కడ విజయం సాధించి నిరూపించుకోవాల్సిన పరిస్థితి టిడిపికి తలెత్తినట్లయ్యింది.