ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కాపు రేజర్వేషన్లపై యూ టర్న్ తీసుకున్న నాటి నుండి ఆయన పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అవుతున్నారు. నిన్నటి రోజున పాదయాత్ర పేరుతో కాపు నేతలతో లక్షలు కోట్లు ఖర్చు పుట్టిస్తున్నారని, కులంలో ఉన్న ఒకరిద్దరిని కూడా నిరుపేదలను చేసే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
వైసీపీ అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్కు 10 వేల కోట్లు ఇస్తామని పాదయాత్ర సభలో జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారని, ఇది ఎంతమాత్రం కరెక్టు కాదన్నారు. మేమే 20 వేల కోట్లు ఇస్తాం… ఇతర కులస్థుడికి సీఎం పదవి ఇస్తారా? అంటూ జగన్ను ముద్రగడ ప్రశ్నించారు. అలాగే మా డిమాండ్లను పరిష్కరించిన పార్టీనే పల్లకీలో మోస్తామని ముద్రగడ అన్నారు.
ఇప్పటికే చంద్రబాబు మీద అన్ని రకాలుగానూ దుమ్మెత్తి పోసిన ముద్రగడ తెలుగు దేశానికి మద్దతు ఇచ్చే అవకాశం తక్కువే. నిన్న కాపు రేజర్వేషన్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సారిగా స్పందించారు. కాపుల వెనుకబాటుతనాన్ని తాము గుర్తించామని, కాపులకు రేజర్వేషన్లు ఇచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
స్వయానా కాపు కులస్థుడు కావడంతో పవన్ కళ్యాణ్ కు ముద్రగడ మద్దతు ఇవ్వడం తేలిక. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గురించి ముద్రగడ గానీ, ముద్రగడ గురించి పవన్ కళ్యాణ్ గానీ పాజిటివ్ గా మాట్లాడింది లేదు. పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి పర్యటన సంధర్భంగా దీనిపై క్లారిటీ రావొచ్చు.