ఏపీకి ప్రత్యేక హోదాపై ఆలస్యంగా గళం విప్పిన టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్… తన తొలి గళాన్ని ఇటీవలే తిరుపతిలో వినిపించిన విషయం తెలిసిందే. అలాగే తన మలి సభను తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి వేదిక మీదే ప్రకటించారు. ఎక్కడైతే బీజేపీ ‘ఒక ఓటు… రెండు రాష్ట్రాలు’ అన్న నినాదాన్ని వినిపించిందో, అక్కడ నుండే తన ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రారంభిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్, కాకినాడలో సభ కోసం ప్రభుత్వానికి దాఖలు చేసుకున్నారు.
ఈ నెల 9న జరగనున్న ఈ సభకు కాకినాడలోని జేఎన్టీయూ వర్సిటీ గ్రౌండ్ వేదిక కానుంది. ఈ మేరకు జనసేన చేసిన దరఖాస్తుకు అటు పోలీసులతో పాటు ఇటు వర్సిటీ అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభకు అనుమతిచ్చిన పోలీసులు, వర్సిటీ అధికారులకు పార్టీ ప్రతినిధి మారిశెట్టి రాఘవ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజనలో కీలక భూమిక పోషించిన బీజేపీ… అందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసిన ప్రదేశంలోనే తన రెండో సభను అనుకున్నట్లుగానే పవన్ కల్యాణ్ నిర్వహించడం అభిమానుల్లో ఊపు తెప్పిస్తోంది.