జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పై విమర్శల వేడి పెంచారు. మలివిడత జనసేన పోరాట యాత్ర లో భాగంగా ఆయన పశ్చిమ గోదావరిలో మాట్లాడుతూ తన వల్లే తెలుగు దేశం ప్రభుత్వం వచ్చినదని ఆయన దెందులూరు బహిరంగ సభలో అన్నారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై తీవ్ర విమర్శలు చేశారు. “నాడు ముఖ్యమంత్రి గారు ఓడిపోతారేమో అని భయపడి నా దగ్గరకు వచ్చి మనం ఓడిపోయినా సరే మళ్ళీ కలిసి పనిచేయాలి అని అడిగారు, జగన్ గారి మీద గెలుస్తా అని నమ్మకం లేక ఆరోజు అడిగారు,” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తాను ఎవరికీ భయపడేది లేదని ఆయన చెప్పుకొచ్చారు. “ఒక్క సీట్ వచ్చినా సరే ఎదురు తిరిగి పోరాడతాం ముఖ్యమంత్రి గారు, అసలు నేను ముఖ్యమంత్రి గా అవ్వాలనుకుంటున్నా అని ఎందుకు అనుకుంటున్నారు, అంతకంటే ఎక్కువ అవ్వడానికి వచ్చానేమో,” అని జనసేనాని ఆవేశంగా అన్నారు.