రాయలసీమ పర్యటన లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. “వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్ళు నాకు జీవితాంతం రుణపడి ఉండాలి. నేను కనిపిస్తే చేతులెత్తి మొక్కాలి. నేను టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేస్తే వీళ్ళు ఎక్కడ ఉండే వాళ్ళు?,” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఉంటే కచ్చితంగా మెరుగైన ఫలితాలు వచ్చేవి.
రాజ్యాధికారం దక్కేదేమో కూడా అని చాలా మంది ఎన్నికల ముందు కూడా అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అనవసరపు పట్టుదలకు పోయి కనీసం సొంత సీటు కూడా గెలవలేని పరిస్థితికి వచ్చారు. అయితే ఇంతజరిగాకా బాధపడి ఏం ప్రయోజనం? వైఎస్సార్ కాంగ్రెస్ మీదా జగన్ మీదా పవన్ కు మొదటినుండీ నిశ్చితమైన అభిప్రాయం ఉంది.
జగన్ అధికారంలోకి రాకూడదని కోరుకుని ఉంటే పొత్తుకే వెళ్ళుండాల్సింది. కాదని వామపక్షాలతోనూ, బీఎస్పీతోనూ ఎన్నికలకు వెళ్లారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. రానున్న స్థానిక ఎన్నికలు జనసేనకు కీలకంగా మారబోతున్నాయి. అక్కడి ఫలితాలు తేడా జరిగితే ఆ పార్టీ మనుగడకే ప్రమాదం.
ఇటువంటి తరుణంలో జనసేన ఏం చేయబోతుంది అనేది చూడాలి. జనసేన పార్టీ ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తైన ఇప్పటికీ గ్రామా స్థాయి నాయకత్వం కాదు కదా కనీసం జిల్లా స్థాయి నాయకత్వం కూడా లేదు. ఇటువంటి తరుణంలో ఈ ఎన్నికలు ఎదురుకోవడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. పవన్ కళ్యాణ్ ఈగో పక్కన పెట్టి పొత్తు వైపు మొగ్గు చూపితే అటు జనసేనకు, ఇటు టీడీపీకి కూడా మంచిది.