Pawan-Kalyan-Jana-Senaతెలంగాణాలో విస్తృతంగా పర్యటించే ఉద్దేశం ఇప్పట్లో లేనట్టుంది జనసేనానికి. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానంతరం కరీంనగర్‌ చేరుకున్న ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణాలో విస్తృతంగా పర్యటిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ క్యాడర్ ను నిరుత్సాహానికి గురి చేశారు పవన్ కళ్యాణ్.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజాయాత్ర ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లా నుంచి చేపడతామని ఆయన తెలిపారు. జిల్లాలో రెండు మూడు రోజులు పర్యటన ఉంటుందన్నారు. ఆ తర్వాత ఒంగోలులో ఫ్లోరోసిస్‌, కిడ్నీ బాధితులను కలుస్తామన్నారు. అనంతరం విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రాన్ని పరిశీలిస్తానని చెప్పారు.

అనంతపురం జిల్లా పర్యటన తర్వాత ఆయా పర్యటనలకు సంబంధించిన తేదీలను ఖరారు చేస్తానని తెలిపారు. ఆంధ్ర ప్రభుత్వంతోగానీ, తెలంగాణా ప్రభుత్వంతో గానీ తో గొడవలు పెట్టుకునే ఉద్దేశమేదీ తనకు లేదని, నిర్మాణాత్మక రాజకీయాలు మాత్రమే తాను చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కార్యకర్తలతో ఆలోచించి ఏయే సమస్యలపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చిస్తామని చెప్పారు.