Pawan Kalyan interaction with social media fans.jpg25 ఏళ్ల పాటు సమాజం కోసం, పార్టీ తరపున కష్టపడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన లక్ష్యం కేవలం ఎన్నికల్లో సీట్లు గెలవడం మాత్రమే కాదని, ‘ప్రజారాజ్యం’ పార్టీ విఫలమైన నేపథ్యంలో ప్రతి విషయంలో నిరూపించుకోవాల్సిన పరిస్థితి తన పైన ఉందని చెప్పారు. 2018 చివరి నాటికి తన బలాబలాలపై ఒక అంచనా వస్తుందని, ఇక్కడ కూర్చుని బలాబలాలను చెప్పడం సహేతుకం కాదని, తాను ఊహల్లో ఉండనని, వాస్తవంగా ఆలోచిస్తానని సహజత్వానికి దగ్గరగా వ్యాఖ్యానించారు.

2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని అన్న పవన్, విజయం సాధించని పక్షంలో పోటీ చేసి ఉపయోగం ఉంటుందా? అధికారం వస్తుందా? అసెంబ్లీకి వెళ్తామా? అన్నది ప్రశ్న కాదని, తన పని చేసుకుంటూ పోతే వచ్చేవి ఎలాగూ వస్తాయని అన్నారు. తాను ఒక ప్రాంతం, ఒక భాషకు పరిమితం కాదని, సోషల్ మీడియా ద్వారా పార్టీని విస్తరించాలని “శతఘ్ని పేరుతో డిజిటల్ టీమ్”ను తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. తాను తెలంగాణలోనే పెరిగానని, తెలంగాణలోని జిల్లాల్లో యువత సమస్యపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తనకు అనిపించలేదని, ఇంకా నేతల వెనుక, వారికి సపోర్టుగా ఉన్నట్టు అనిపిస్తోందని, వారిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

“ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతు, దయ ఇలాగే కొనసాగాలి. నేను పుట్టినరోజు వేడుకను జరుపుకోను. కానీ, ఈ వేడుకను మీరందరూ జరుపుకుంటున్నారు… ‘నేను నిజంగా ఇంతటి ప్రేమకు అర్హుడినా?’ అని నేను అంతర్ముఖంగా ప్రశ్నించుకున్నాను. ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన నన్ను, దేవుడు ఆశ్చర్యపరుస్తూ జగమంత కుటుంబాన్ని ఇచ్చాడు” అని తన వరుస ట్వీట్లలో పవన్ పేర్కొన్నారు. ఎప్పటిలాగానే పవన్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు.