తిరుపతి వేదికగా జరిగిన బహిరంగ సభలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ తన వాగ్ధాటిని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై ఎక్కుపెట్టారు. తొలుత సూచనలతో మొదలైన పవన్ ప్రసంగంలో ఛలోక్తులు, పంచ్ లు, సెటైర్లుతో నింపుకుని చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించే వరకు వెళ్ళింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న జైరాం రమేశ్ నుండి ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు వరకు పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి.
వెంకయ్య నాయుడు గారు… మీరు చేస్తున్నది తప్పు… మీ రాజకీయ అనుభవం అంత వయసు నాకు లేకపోవచ్చు… అయితే ఏ నోటితో అయితే… అయిదు కాదు, పది, పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు? ఇప్పుడు దానికి విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? పార్టీ ప్రయోజనాలను కాస్త పక్కనపెట్టి ప్రజాప్రయోజనాల గురించి కూడా చూడండి… ముందుగా మీరు తెలుగు వారిగా పుట్టారు… అలా తప్పించుకునే వ్యాఖ్యలు చేయడం తప్పు… పోరాటం చేయండి… సాధించండి… అంటూ సూచనలతో కూడిన విమర్శలు చేసారు పవన్.
జైరాం రమేశ్ గారు… తెలుగు రాష్ట్రం తరపున రాజ్యసభకు ఎన్నికై తెలుగు ప్రజల ఋణం మీరు బాగా తీర్చుకున్నారు. చాలా అందంగా రాష్ట్ర విభజన చేసారు… మీ మేధస్సుకు, మీ తెలివితేటలకు నా నమస్కారం… అంటూ బోలెడంత వెటకారాన్ని పండించారు పవన్. అలాగే ప్రస్తుత ఆర్ధిక మంత్రి చెప్తున్న ‘లెక్కలను’ ప్రస్తావిస్తూ… మీరు చెప్తున్నదంతా విని విని విసిగిపోయాం… ఇక ఆపండి… ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారు అని చెప్తున్న మీకు… అప్పుడు రాష్ట్ర విభజనకు 6 కోట్ల మంది సీమాంధ్రులు కనపడలేదా? అంటూ ప్రశ్నించారు.
మోడీ గారు… కన్నతల్లి వంటి ఆంధ్రప్రదేశ్ ను చంపి బిడ్డ అయిన తెలంగాణాను బ్రతికించారు… ఇప్పుడేమో శవాన్ని కాల్చేయమంటున్నారు. ఇదెక్కడి న్యాయం? దక్షిణాదిన క్రిందన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బహుశా మీ కంటికి కనపడలేదేమో… కానీ, మీకు కనపడేలా చేస్తా… మా హక్కును మేం సాధించుకుంటాం… అంటూ ఒక విధంగా ఉద్వేగపూరితమైన హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేసారు ‘జనసేన’ అధినేత. ఇప్పటివరకు కేంద్రాన్ని అడగలేదు… ప్రశ్నించలేదు… అని విమర్శలు చేసిన వారికి పవన్ చేసిన ‘కడుగుడు’ వ్యవహారం ఒక విధంగా అవాక్కయ్యే సమాధానమే మరి!