గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ మరలా సినిమా చేయనున్నారని అటు సినీవర్గాలలో ఇటు రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తున్న చర్చ. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం దానిపై ఇప్పటివరకూ నోరు మెదపలేదు. అయితే పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ చిత్రాన్ని అధికారికంగా ఖరారు చేశారు బోణీ కపూర్. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్ర తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
నానితో ఎం సి ఏ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోగా,బోని కపూర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారని ఆ ప్రకటన సారాంశం. అయితే పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ అభిమానులకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం అన్ని త్యజించి వచ్చాడని అభిమానులు ఎన్నికల సమయంలో బలంగా చెప్పేవారు.
పవన్ కళ్యాణ్ కూడా ఇక సినిమాలు చేసేది లేదు అనడంతో వారు త్యాగశీలిగా చూపించేవారు. అయితే ఇప్పుడు ఈ కమ్ బ్యాక్ ను సపోర్టు చెయ్యడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అవినీతి సొమ్ము పార్టీ ఫండ్ గా తీసుకోవడం ఇష్టం లేకే పవన్ కళ్యాణ్ కష్టపడి సినిమాలు చేసి డబ్బులు సంపాదించబోతున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు.
అయితే గతంలో మాట్లాడినంత బలంగా ఇప్పుడు మాట్లాడలేకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి తిరిగి వెళ్తే ఆయనకు రాజకీయంగా ఇబ్బందే అని విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ను స్థిరమైన వ్యక్తిగా నమ్మకే ఆయనకు ఎన్నికలలో ఘోరమైన ఫలితాలు వచ్చాయని, ఇప్పుడు ఈ నిర్ణయంతో ఆయన ఆ అభిప్రాయాన్ని బలపరుస్తున్నారని వారు అంటున్నారు.