పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ సభను కాకినాడలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సభలో మరో వ్యక్తి చెట్టుపై నుండి క్రింద పడి గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి కూడా విదితమే. కాలం చేసిన అభిమాని సంగతిని హీరో పవన్ కళ్యాణ్ స్వయంగా చూసుకోగా, గాయాల పాలైన అభిమానిని తోటి పవర్ స్టార్ అభిమానులు చూసుకుంటున్నారు.
రామచంద్రాపురం మండలం, వెల్లసావరానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే పవన్ అభిమాని, కాకినాడ సభకు వచ్చి చెట్టు కొమ్మపై కూర్చుని తిలకిస్తున్న సమయంలో… ఒక్కసారిగా జారి క్రింద పడడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో వెన్నెముక, కాళ్ళకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో కాకినాడ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసారు. ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న సుబ్రహ్మణ్యం, ఇటీవలే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి, ఇంటికి చేరుకున్నాడు.
సుబ్రహ్మణ్యంకున్న ఆర్ధిక సమస్యలు తెలుసుకున్న ద్రాక్షారామం, తోటపేటకు చెందిన పవన్ అభిమానులు, అతని ఇంటికి వెళ్లి 20,000 రూపాయలను ఆర్ధిక సాయంగా అందజేసారు. పవన్ కు సంబంధించిన ఏ చిన్న సంఘటన జరిగినా, ముందుండే అభిమాన గణం, తమ తోటి అభిమాని ఇబ్బందుల్లో ఉన్నపుడు ఇలాంటి ఆర్ధిక సాయం విషయంలోనూ ముందుకు వచ్చి, తోచినంత అందివ్వడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.