జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది.
ఇది ఒక పీరియడ్ సినిమా అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి. కోహినూర్ డైమండ్ నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందట. ఆ వజ్రాన్ని కాకతీయుల దగ్గర నుండి అల్లావుద్దీన్ ఖిల్జీ దొంగలించాడట. అక్కడ నుండి బాబర్ వద్దకు… ఆ తరువాత కొన్ని చేతులు మారి 1850లో ఆంగ్లేయుల దగ్గరకు చేరిందట.
షాజహాన్ దగ్గర నుండి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఒక దొంగల ముఠా తస్కరించడానికి ఏం చేసింది అనే ఊహాజనితమైన కథ ఈ సినిమా అని అంటున్నారు. మొఘలాయిల కాలానికి సంబంధించిన కథ ఇది. మహమ్మదీయుల పరిపాలనా కాలం, అప్పటి పరిస్థితులు… ఇవన్నీ తెరపై చూపించబోతున్నారు.
కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం ఆయనకు ఇదే మొదటి సారి. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ పక్కన నటించబోయే హీరోయిన్ ని ఫైనల్ చెయ్యలేదు. మొదట్లో 2021 సంక్రాంతికి విడుదల చెయ్యాలని అనుకున్నా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రానుండడంతో ఏం చెయ్యబోతున్నారు అనేది చూడాలి.