జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా విపత్తు నుండి ప్రజలను కాపాడమని దేవుడిని వేడుకొంటూ నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారని సమాచారం. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు దీక్షను ప్రారంభించి ఆయన కార్తీక శుక్ల ఏకాదశి నాడు విరమిస్తారు. దీక్షను విరమించే సమయంలో హోమాన్ని నిర్వహించబోతున్నారు.
ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో దీక్ష కొనసాగుతంది. కార్తీక శుక్ల ఏకాదశి నాడు దీన్ని విరమిస్తారు. ఈ దీక్ష సమయంలో ఒంటిపూట మాత్రమే తింటూ… కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకుంటారు. అంటే పూర్తిగా మాంసాహారానికి దూరంగా ఉండబోతున్నారట.
జనసేన పార్టీ ఒక పత్రికా ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ఇది ఇలా ఉండగా… కరోనా మహమ్మారి వచ్చిన తొలి నాళ్లలోనే పవన్ కళ్యాణ్ భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వంతో.. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా విరాళాలు ఇచ్చారు. అదే సమయంలో కరోనా కంటే ముందే సెట్స్ మీద ఉన్న రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు ఈ విపత్తు కారణంగా ఆగిపోయాయి.
పరిస్థితులు ఎప్పుడు సాధారణం అవుతాయి అనేదాని మీద క్లారిటీ లేకపోవడంతో ఆ సినిమాల పై క్లారిటీ రావడం లేదు. దాదాపుగా 80% షూటింగ్ పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిందని సమాచారం. అలాగే క్రిష్ సినిమా 2021 రెండవ భాగానికి వాయిదా పడవచ్చు అంటున్నారు.