జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. చాలా సంవత్సరాలుగా సినిమాలతో పెంచుకున్న ఫాలోయింగ్ తో రాజకీయాలలో సక్సెస్ అవ్వడం తేలికే అనుకున్నారు ఆయన. కనీసం తాను కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు.
ప్రజారాజ్యం ఫెయిల్యూర్ వల్ల అయితేనేమి… సొంతంగా తనకు సీరియస్ పొలిటిషన్ అని అనిపించుకోకపోవడం వల్లేమో గానీ… తప్పుడు రాజకీయ వ్యూహాల వల్లేమో గాని 2019 ఎన్నికలలో ఘోరంగా విఫలమయ్యారు. అయితే ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది అయిపోయినా జనసేన విషయంలో పెద్దగా మార్పు లేదు.
పార్టీ నిర్మాణం విషయంలో పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదు. నాయకులు పార్టీని విడిచిపోతున్నా పట్టించుకున్నది లేదు. పైగా ఈ మధ్య బీజేపీతో పొత్తు పెట్టుకుని మోడీ భజన మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ చూస్తే… మోడీ భజన లేదా… బీజేపీ నాయకులను విష్ చెయ్యడం మాత్రమే కనిపిస్తుంది.
రెండు రోజుల నుండి పవన్ కళ్యాణ్ సమకాలీన విషయాల పై తన అభిప్రాయాలను చెబుతూ పార్టులు పార్టులుగా తన ఇంటర్వ్యూని విడుదల చేస్తున్నారు. అందులో కూడా మోడీ భజనే ఎక్కువగా ఉంది. ఏ విషయంగురించి అడిగినా ప్రభుత్వం పై విమర్శలు చేసేసి.. మీరు ఏం చేస్తారు అంటే వారి కోసం బలంగా నిలబడతాం అని చెప్పి ఊరుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ సొంత బలం కంటే మోడీ మీదే ఎక్కువ ఆధారపడుతున్నాడా? అని అనిపించకమానదు.