Pawan Kalyan delhi tourజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఉన్నఫళంగా  గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ  కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అవసరమైతే ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తానని గతంలోనే ప్రకటించిన వ్యాఖ్యల నేపధ్యంలో పవన్ ఢల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2014లో బీజేపీకి మద్దతు పలికిన పవన్ ఆ తరువాత ప్రత్యేక హోదా విషయమై ఆ పార్టీతో విబేధించి 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేశారు.

కేవలం ఒక సీటు మాత్రమే రాబట్టగలిగారు. పవన్ కళ్యాణ్ సైతం తాను పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓడిపోయారు. పార్టీ మనుగడ సాగించాలంటే టీడీపీతో గానీ బీజేపీతో గానీ కలిసిపని చెయ్యాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు వార్తలు వినవస్తున్నాయి. దీనితో ఈ ఢిల్లీ టూర్ రాజకీయంగా సంచలనం సృష్టిస్తుంది.
ఈ ఉదయం మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని జనసేనాని ప్రారంభించి.. భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం మధ్యలోనే వదిలేసి ఉన్నఫళంగా ఢిల్లీకి బయల్దేరడం పై అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. చూడాలి మునుముందు ఏం జరగబోతుందో