Pawan Kalyan Delhi tour creates ripples in ysrcpరెండు రోజుల దిల్లీ పర్యటన ముగించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. దిల్లీ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎవరిని కలిశారనేది వెల్లడించడానికి పార్టీ వర్గాలు ఆసక్తి చూపలేదు. ఆయన పర్యటనను గోప్యంగా ఉంచారు. అయితే ఢిల్లీ వెళ్తున్నారు అని ప్రకటించి ఆ తరువాత వివరాలు వెల్లడించకపోవడం విశేషమే.

దీనిపై రకరకాల ఊహాగానాలు మొదలవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రహస్యంలో కేంద్రంలోని పెద్దలతో సమావేశం అయ్యారని జనసేన అభిమానులు చెప్పుకుంటే… జనసేనాని రెండు రోజులు ఢిల్లీలో మకాం వేసి కేంద్ర పెద్దల అప్పాయింట్మెంట్ కూడా దొరకక వెనుదిరిగివచ్చారని సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ప్రచారం చేస్తుంది.

చంద్రబాబు ఏజెంట్ గా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారని ఇంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించడం కొసమెరుపు. కేంద్రంలోని పెద్దలు చంద్రబాబుకు అప్పాయింట్మెంట్ ఇవ్వరు కాబట్టి దూతగా పవన్ కళ్యాణ్ ని పంపారని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అయితే పవన్ దిల్లీ టూర్ తో తమకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీ ప్రకటించింది.

పవన్ కళ్యాణ్ వెళ్లి మోడీ, అమిత్ షాలకు జగన్ కు మధ్య పుల్ల పెడతారేమో అని వారు భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల దిల్లీ లో ఏం జరిగింది అనే భయం వారిలో ఉన్నట్టే కనిపిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ కేంద్రం పట్ల విధేయంగా ఉంటున్న సంగతి తెలిసిందే.