జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గాజువాక నుండి భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య నామినేషన్ దాఖలు చేసారు. ఈ రోజు విశాఖలో ఆయన మూడు మీటింగులలో మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం స్థాపించబోతుంది, మీరు కోరుకున్నట్లుగా నేను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాం,” అంటూ ఆయన ప్రకటించడం విశేషం.
“జనసేన ప్రజా ప్రభుత్వ స్థాపనకు గాజువాక సాక్షిగా ప్రస్థానం మొదలుపెడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం రాదు అంటారా మీరు, నా వెనుక 10 మంది లేరు అంటారా, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి మీకు రాజకీయం అంటే ఏంటో చూపిస్తాం. ఇప్పటి వరకు నాకు ఎవరూ ఏమీ చేయకపోయినా నేను పనిచేసుకుంటూ వెళ్ళాను, ఈ ఒక్కసారి మీరు నాకు అండగా నిలబడి జనసేన పార్టీని గెలిపించండి, నా కడ శ్వాస వరకు మీకోసం పనిచేస్తాను,” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ జగన్ పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. జగన్.. జాతకం ఈడీ, సీబీఐ దగ్గర ఉంటుందన్నారు. ఆయన దోపిడీనే చేస్తారా? మనకు న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. “ఎంతో ప్రశాంతంగా ఉండే మన విశాఖ ప్రాంతంలో కిరాయి మూకలకు అధికారాన్ని ఇస్తామా, వైసీపీ వాళ్లు అసలు విశాఖలో వచ్చి పనిచేయగలరా, జేడీ లక్ష్మీనారాయణ గారిని చూస్తేనే పారిపోయే వారు,” అంటూ విమర్శించారు పవన్ కళ్యాణ్.