Pawan Kalyan corruption allegations on chandrababu naiduతెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనే అవినీతి ఆరోపణలు చేసి హాట్ టాపిక్ గా మారారు. మొన్నటివరకు టిడిపి నేతలతో పాటు చినబాబు నారా లోకేష్ పైన కూడా అవినీతి ఆరోపణలు చేసిన పవన్, తాజాగా ఏకంగా సిఎం పైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చూస్తుంటే, విమర్శలలో మరో అడుగు ముందుకు వేసినట్లుగానే కనపడుతున్నారు.

‘విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణంలో పలువురు మంత్రులతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయం ఉందన్న సమాచారం తనకు తెలుసని’ అన్న పవన్ వ్యాఖ్యలపై ఎంతవరకు నిలబడతారో చూడాలి. ఎందుకంటే గతంలో లోకేష్ పై కూడా ఇలాగే అవినీతి ఆరోపణలు చేసి నాలుక కరచుకున్న విషయం తెలిసిందే. ‘ఎవరో చెప్పారు, అందుకే తాను అన్నానంటూ’ బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేసిన పవన్, ఈ సారైనా చేసిన విమర్శకు కట్టుబడి ఉంటారో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే అనాలోచితమైన ప్రకటనలు చేస్తూ ప్రజలలో తన ప్రభావాన్ని తగ్గించుకుంటున్న పవన్, ఈ సారి ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడంతో, నిజంగానే పవన్ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎందుకు బయట పెట్టకుండా ఈ బెదిరింపు రాజకీయాలు ఎందులకు? ఈ సారి ఖచ్చితంగా పవన్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి ఇలా ఏదొక విమర్శ చేసి, వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు అంటే రాజకీయాలలో నడవదు, అందులోనూ రాజకీయ ప్రక్షాళన చేస్తానంటున్న పవన్ కు అస్సలు చెల్లుబాటు కాదు.