తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ తరువాత అధికార పార్టీ నాయకులు మూకుమ్మడి దాడి చేస్తున్నారు. “జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞాన వాసి కూడా. పవన్ కళ్యాణ్ మాటలే ఇందుకు నిదర్శనం. అద్దె మైకుగా పనిచేసే పవన్ కళ్యాణ్కు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం అలవాటైపోయింది,” అని మంత్రి పేర్ని నాని విమర్శించారు.
“టీడీపీ–బీజేపీ ప్రాయోజిత కార్యక్రమం ద్వారా తిరుపతిలో పవన్ నాయుడు వినోదాన్ని అందించాడు. ఒకసారి టీడీపీకి ఓటు వెయ్యమంటాడు, ఇంకోసారి బీజేపీకి ఓటు వెయ్యమంటాడు. రోజుకో పార్టీకి ఓటేయమని చెప్పే పవన్ కళ్యాణ్ను ముందు నిలదీయాల్సిన అవసరం ఉంది,” అని ఎద్దేవా చేశారు ఆయన.
నిజమే పవన్ కళ్యాణ్ 2014లో టీడీపీ కి మద్దతు ఇచ్చి ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అయితే అది తప్పని ఎలా అనగలం? వైఎస్సార్ కాంగ్రెస్ లోని వారందరూ దైవం అని చెప్పుకునే వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో రాహుల్ గాంధీ ని ప్రధాని చెయ్యాలి అని పదే పదే అనేవారు. ఇప్పడు అదే వైఎస్సార్ పేరు తో పెట్టిన పార్టీ రాహుల్ గాంధీ మీద యుద్ధం చేయలేదా?
జగన్ కూడా సోనియాకు వంగి వంగి నమస్కారం పెట్టినవారే కదా? కాలాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి. ఇదే బీజేపీకి అవసరమైనప్పుడల్లా పార్లమెంట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. గతంలో బీజేపీ మతతత్వ పార్టీ అని వైఎస్ నుండి జగన్ వరకు విమర్శలు చేసిన వారే కదా? పవన్ ది తప్పయితే జగన్ ది కూడా తప్పే!