నేడు, రేపు విశాఖ నగరంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలివచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టబోతున్నారు. కనుక జనసేన పార్టీ ‘పానకంలో పుడక’లా వ్యవహరించదని, ఈ రెండు రోజులు వైసీపీ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయదని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
“దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన పార్టీ స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతోపాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నాను.
వైసీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం. ఏపీలో ఆర్ధికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి.
రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి.
ఈ సమ్మిట్ ఆలోచనలను కేవలం వైజాగ్కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప… ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి.
దీన్ని కేవలం ఒక్క నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్లాగా మార్చండి.
ఇక చివరిగా… రానున్న రెండురోజులలో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సంపూర్ణ మద్దతు అందిస్తోంది. ఇన్వెస్టర్ల సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న,” అంటూ పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్స్ చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయనని చెపుతూనే, “రివర్స్ టెండరింగ్ అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, కమీషన్ల కోసం కక్కుర్తిపడకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించడంటూ పవన్ కళ్యాణ్ చిన్నగా చురక వేశారు. మీ ప్రభుత్వ విధానం అలాగే ఉంది గాబట్టి పెట్టుబడుదారులకు నమ్మకం కలిగించేందుకు ప్రయత్నించమంటూ పవన్ కళ్యాణ్ చురక వేశారు.