ఏపీ సర్కార్ ప్రయోగించిన భూసేకరణ నిర్ణయంతో ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ విభేదించిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు – పవన్ల మధ్య ఉన్న సయోధ్య సమసిపోయిందని, దీని వల్లే శంకుస్థాపన వేడుకకు పవన్ హాజరు కాలేదన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై అటు పవన్ గానీ, ఇటు టిడిపి వర్గాలు కానీ స్పందించలేదు.
అయితే వీరిద్దరి భేటీకి తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు జరిగాయన్నా వార్తలు వచ్చినా, అవేమీ కార్యరూపం దాల్చలేదు. మరి అనూహ్యంగా ఈ రోజు భేటీ కానున్న నేపధ్యంలో దీని వెనుక ఎవరు కీలక పాత్ర పోషించారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాలో నెలకొంది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం బీజెపికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నారని తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేశారని, అలాగే భేటీ తర్వాత పవన్-చంద్రబాబు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారన్న టాక్ కూడా ఉంది.