Pawan Kalyan Busyజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతి ఉపఎన్నిక తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కరోనా పేరిట ప్రచారం మధ్యలోనే ముగించిన ఆయన… ఆ తరువాత బీజేపీ డిపాజిట్ కోల్పోవడంతో పూర్తిగా స్తబ్దుగా మారిపోయారు. అడపాదడపా ఆయన పేరిట జనసేన పార్టీ ప్రెస్ నోట్లు విడుదల చేస్తుంది తప్ప ఆయన స్వయంగా వివిధ అంశాల మీద మాట్లాడింది లేదు.

పవన్ కళ్యాణ్ మౌనానికి అర్ధం ఏంటో తెలియక అభిమానులు తికమకపడుతున్నారు. మరోవైపు వచ్చే నెల 11/12 తారీఖులలో పవన్ కళ్యాణ్ తన అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా షూటింగ్ మొదలుపెడతారట. ఆ తరువాత హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటారు. ఆ రెండు సినిమాలు పూర్తి అయితే తన సినిమాను పట్టాలెక్కించడానికి హరీష్ శంకర్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

అంటే ఇప్పుడు సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్… తొందర్లో బిజీ కాబోతున్నారు. ఏ రకంగా చూసినా ఆయన జనసేన కార్యక్రమాలకు దూరంగానే ఉండబోతున్నారు. దీనితో పార్టీ శ్రేణులు పూర్తిగా నిస్తేజంగా మారిపోయాయి. పార్టీ కింద స్థాయి నాయకులు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారట.

నిరుడు పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు అంటూ హడావిడి చేసి ఆ తరువాత కరోనా పేరిట పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రానున్న మూడు నెలలలో బద్వేల్ ఉపఎన్నిక జరగబోతుంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే మరో సారి బీజేపీ – జనసేనలలో ఎవరు నిలబడినా డిపాజిట్ కోల్పోవడం ఖాయం. ఇక అక్కడ నుండి పవన్ పార్టీ మీద దృష్టి పెట్టినా ప్రయోజనం ఉండదు.