జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఒక పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి చంద్రబాబు కట్టిన కారణం అని చెప్పుకొచ్చారు. అప్పటి ప్రభుత్వానికి కావాల్సిన వారు అక్కడి భూములు తక్కువకి కొనేశారని, దానితో తెలంగాణ రైతులు మోసగింపబడ్డామని భావించి ఆంధ్రావారి మీద ద్వేషం పెంచుకున్నారని విశ్లేషించారు.
అయితే తెలంగాణ డిమాండ్ సైబరాబాద్ కంటే ముందు ఉందని పవన్ కళ్యాణ్ కు తెలీదా? సరే పవన్ కళ్యాణ్ చెప్పేది నిజమే అనుకుందాం హైటెక్ సిటీలో భూములు అప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు కొనుకున్నారు. అందులో ఆంధ్ర వారు ఉన్నారు తెలంగాణ వారూ ఉన్నారు. డబ్బుకు కులం ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి?
ప్రభుత్వం అక్కడ ఐటీ సిటీ వస్తుందని కావాల్సిన వాళ్లకు మాత్రమే తెలపడమే అవినీతి అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చాలా ప్రాజెక్టులు అనుకుంటుంది అందులో కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు. ఉదాహరణకు దొనకొండ రాజధాని అన్నపుడు చాలా మంది అక్కడ భూములు కొన్నారు ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? అప్పుడు భూములు ఎక్కువ ధరకు అమ్ముకున్న రైతులే లాభపడ్డారు కదా?
చంద్రబాబు హైటెక్ సిటీ మొదలుపెట్టే నాటికి అక్కడ పిచ్చి మొక్కలు మొలిచేవి. ఇప్పుడు బంగారం ఆ భూములు. ఆ స్థాయికి చేరుకుంటుంది అని నమ్మిన వారికి నజరానా పెరిగిన భూముల రేట్లు. సైబరాబాద్ వల్ల తెలంగాణ కాంక్ష బలపడింది అని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అయితే అదే సైబరాబాద్ ఇప్పుడు తెలంగాణకు మిగులు బడ్జెట్ తెచ్చిపెట్టింది కదా. ఒక రకంగా తెలంగాణలోని మిగతా జిల్లాలు అన్నీ సైబరాబాద్ మీదనే ఆధారపడుతున్నాయి కదా? దానిని పవన్ కళ్యాణ్ చూడలేకపోతున్నారా? చూడదల్చుకోలేదా?