జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఉత్తరాంధ్రలోని గాజువాకలో తన నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఆయన తన రెండో సీటు భీమవరంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే ముందు ఆయన ఒక మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తనను గెలిపిస్తే భీమవరాన్ని అంతర్జాతీయ నగరాన్ని చేస్తా అని ఆయన మాట ఇచ్చారు. తాను ఓటు అడిగేది తన కోసం కాదని భావి తరాల కోసమని జనసేనాని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మనం ఇక్కడ కులం అని మతం అని మనలో మనం కొట్టుకుంటున్నారు. దీనితో ఆంధ్రావాళ్ళని తెలంగాణాలో కొడుతున్నారు. ఇక్కడ మనం దళితులం, క్షత్రియులం, కాపులం అక్కడ మాత్రం వారికి మనం ఆంధ్రులం. ఎక్కడో వీటన్నిటితో నేను విసిగిపోయి ఉన్నాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే దీని పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ వారు పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అవుతున్నారు.
2014లో టీడీపీ తరపున గెలుపు కోసం నన్ను బ్రతిమాలిన తలసాని ఇక్కడ మీటింగులు పెట్టి వైకాపా అభ్యర్థిని గెలిపించమంటున్నారు అని పవన్ ఎద్దేవా చేశారు. “తెలంగాణ ఏర్పడిన ఐదేళ్ళలో ఒక్క సారి కూడా ఆంధ్ర వారి మీద దాడి అనేది జరగలేదు. ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు కలిసి మెలిసి ఉంటున్నారు. రాజకీయ లబ్ది కోసం పవన్ కళ్యాణ్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఏమీ బాలేదు. విలక్షణమైన రాజకీయాలు చేస్తా అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి రాజకీయాలు చెయ్యడం తగదు,” అని వారు అంటున్నారు.