రాజధాని మార్పుని వ్యతిరేకిస్తూ జనసేన పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా మార్చ్ చెయ్యడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా రాజధాని అంశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత్రికేయులతో నిర్వహించిన ఇష్ఠాగోష్టిలో ఆయన మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం కేంద్రానికి బాధ్యత ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే బీజేపీకి చెందిన కేంద్ర నాయకులు, మంత్రి కిషన్ రెడ్డి వంటి వారు దీంట్లో కేంద్రం పాత్ర ఉండదు అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోరికను కేంద్రం మన్నిస్తుందా అనేది చూడాలి.
ఇది ఇలా ఉండగా మార్చ్ పై కృష్ణా, గుంటూరు జిల్లా నాయకులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఎప్పుడు చెయ్యాలి, ఎంత మందితో చెయ్యాలి, అమరావతిలో తాజా పరిస్థితి ఏమిటి అని ఆయన వారితో మాట్లాడి కనుక్కున్నారు. ఈరోజో రేపో మార్చ్ తేదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా అమరావతి రైతుల ఆందోళన నేడు 24వ రోజుకు చేరింది. మరోవైపు జిల్లాలలో టీడీపీ, సిపిఐ, అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన బస్సు యాత్ర ఈరోజు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలతో టీడీపీ శ్రేణులను అడ్డుకుంటుంది.