‘పోరాట యాత్ర’ ప్రారంభించిన నాటి నుండి ‘జనసేన’ అధినేత ఇప్పటివరకు రకరకాల కారణాలతో యాత్రకు బ్రేక్ లిచ్చారు. అలా విరామాలు ప్రకటించిన ప్రతిసారి విమర్శల పాలు కావడం పవన్ వంతయ్యింది. ఎందుకంటే బ్రేక్ లకు చెప్పిన కారణాలు చాలా సిల్లీగా ఉండడంతో, పవన్ చిత్తశుద్ధిపై ప్రశ్నల వర్షం కురిసింది. ఎన్ని విమర్శలు వచ్చినా, పవన్ తన యాత్రలకు బ్రేక్ లిస్తూనే వచ్చారు.
ఆ క్రమంలోనే తాజాగా మరో ‘బ్రేక్’కు ప్రకటించారు. అయితే ఈ సారి మాత్రం ఆ బ్రేక్ కు సరైన కారణం ఉంది. గత కొన్ని నెలలుగా కంటి సమస్యతో బాధపడుతోన్న పవన్ కు ఎట్టకేలకు శస్త్ర చికిత్స జరిగింది. హైదరబాద్ లోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో పవన్ కంటిలో వచ్చిన కురుపును వైద్యులు విజయవంతంగా తొలగించారు. దీనికి గానూ కొన్నాళ్ళ పాటు పవన్ తన పోరాట యాత్రకు బ్రేక్ ను ప్రకటించారు. మరలా ఈ నెలాఖరులో యాత్ర తిరిగి ప్రారంభం కావచ్చు.