డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిబ్బంది కి మద్దతు ఇవ్వడానికి విశాఖ పట్నం వచ్చిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ నష్టాలలో ఉన్న కంపెనీలను ప్రైవేటైజ్ చేయడం లో తప్పు లేదని, కాని లాభాలలో ఉన్న కంపెనీలను ప్రైవేటు పరం చేయడం సరికాదని భావిస్తున్నానని ఆయన అన్నారు. లాభంలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటు పరం చేయాలని అనుకోవడం సరి కాదని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్.పి హరిబాబు, అనకాపల్లి ఎమ్.పి శ్రీనివాస్ తప్పించుకోవచ్చేమో కాని, బిజెపి, టిడిపి తప్పించుకోలేవని ఆయన అన్నారు. టిడిపి, బిజెపి నేతలకు ఎంత బాద్యత ఉందో తెలియదు కాని, తాను బాద్యత మర్చిపోలేదని ఆయన అన్నారు. నేను టీడీపీ, బీజేపీ పక్షం కాదని ప్రజాపక్షం అని ఆయన ప్రకటించుకున్నారు.
గతంలో ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సెన్సార్ విషయంలో ఇబ్బంది వచ్చిన తాను ఎవరిదగ్గరకి వెళ్లలేదని ఆయన చెప్పుకొచ్చారు. నాకు భయం లేదు, ధైర్యం ఉంది… ఒక ప్రాణం… పోతే అది మీకోసం పోగొట్టుకుంటాను కానీ, ఎవరి కోసమో కాదని ఆయన ఆవేశంగా ప్రకటించారు. ప్రభుత్వాలను విమర్శిస్తే ఇబ్బంది పెడతారని కొందరు అంటుంటారని, కాని తాను అడుగుతున్నానని ఏమి పీకుతారు అని ఆయన సవాల్ చేశారు. నేను పిడికెడు మట్టే కావొచ్చు… కానీ, అది ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నారు ఆయన. మొట్టమొదటి సారిగా డీసీఐ విషయంగా ప్రధానమంత్రికి ఉత్తరం రాయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.