‘మెగా బ్రదర్స్’ మధ్య గత రెండు, మూడు సంవత్సరాలుగా నెలకొన్న పరిస్థితులు మెగా అభిమానులను రెండుగా విడదీసాయనేది కాదనలేని సత్యం. అయితే వీటిపై అటు చిరంజీవి వర్గం నుండి గానీ, ఇటు పవన్ కళ్యాణ్ తరపు నుండి గానీ ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో మీడియా వర్గాల వేదికగా మెగా బ్రదర్స్ మధ్య అభిప్రాయ బేధాలపై చర్చలు జరిగాయి. అయితే ఇటీవల ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో చిరంజీవి హాజరు కావడంతో కాస్త ఈ పుకార్లకు చెక్ పెట్టినట్లయ్యింది. అయితే అసలు పవన్ మదిలో తన అన్నయ్య మెగాస్టార్ గురించి ఏమనుకుంటున్నారు? తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం లభించింది.
“అన్నయ్య చిరంజీవితో రాజకీయ బేధాభిప్రాయాలు ఉన్నాయి కానీ, ఆయనను వ్యతిరేకించేత అభిప్రాయ బేధాలు లేవని, ఉండబోవని” ఒక స్పష్టమైన ప్రకటన చేసారు. ‘ఎవరు ఏమనుకున్నప్పటికీ అన్నయ్య తరువాతే తానని, అన్నయ్య స్ధానం అన్నయ్యదేనని’ అన్నారు. అభిమానుల్లో తనను ఇష్టపడే వారు ఉన్నప్పటికీ వారికి అన్నయ్య అంటే వ్యతిరేకత ఉండదని, మెగా ఫ్యాన్స్ అని… పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని… విభేదాలు లేవని పవన్ పలికిన మాటలు మెగా అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి.