ఈరోజు ఉదయం టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోబోతున్నాయని, ఇందుకు గాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక రహస్య ప్రదేశంలో కలుసుకుని మాట్లాడుకున్నారనీ జనసేనకు 25 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారని సాక్షి ఒక వార్త వండి వార్చింది. ‘ఇన్నాళ్లూ తిట్టుకొని ప్రజల ముందుకు వెళ్లాం. ఇప్పుడు జనం ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లగలుగుతాం? ఇప్పటికిప్పుడు కలసి పోటీ చేస్తామంటే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఏం చెప్పి నమ్మించగలం?’ అనే అంశాలపైనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ల మధ్య ప్రధానంగా చర్చినట్టు చెప్పింది సాక్షి.
ఇది ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ దీని మీద ట్విట్టర్ లో స్పందించారు. టీడీపీ, వైసీపీలు జనసేనను దెబ్బతీయడానికి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఓ సీనియర్ రాజకీయ నేత తనకు చెప్పారన్నారు పవన్. ఈ విషయాలన్నీ చెప్పడానికి తనకు న్యూస్ పేపర్, ఛానల్ లేదని.. జనసైనికులే తనకు పేపర్లు, ఛానల్స్ అన్నారు. రాజకీయ చదరంగంలో తానో చిన్న పావునన్నది నిజమే.. కానీ పోరాటానికి సిద్ధమైన సైనికుడిని అన్నారు జనసేనాని.
అయితే దీనిపై టీడీపీ అభిమానులు మండి పడుతున్నారు. “సాక్షిలో వచ్చిన వార్తలకు టీడీపీకి ఏం సంబంధం? మొన్నటి వరకూ అవే వార్తలను మోసి మమల్ని విమర్శించారు. ఇప్పుడు సాక్షి తన నిజస్వరూపం చూపించింది. జనసేన తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీని విమర్శించక్కర్లేదు,” అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అదే విధంగా తనకు టీవీ, పేపర్ లేవు అనడాన్ని కూడా పలువురు ఆక్షేపిస్తున్నారు. “వైకాపాకు సాక్షి ఎలాగో జనసేనకు ఆంధ్రప్రభ అలా ఉంది ఈరోజున. అదే విధంగా 99టీవీ ఛానల్ కూడా. ముత్తా గోపాల కృష్ణ ఆంధ్రప్రభ జనసేనలో చేరలేదా? జనసేన ప్రధానకార్యదర్శి తోట చంద్రశేఖర్ 99టీవీల్లో వాటా కొనలేదా? పవన్ కళ్యాణ్ ప్రజలను ఏమని నమ్మించాలనుకుంటున్నారు?,” అంటూ విమర్శిస్తున్నారు.