sushma-swaraj-pakభారత్ పై కవ్వింపు చర్యలు, మాటలతో రెచ్చగొట్టుడు ధోరణిని అవలంభిస్తున్న పాకిస్తాన్ కు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గట్టిగా బదులిచ్చారు. “జమ్మూకాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, అది ఎంత కాలమైనా భారత్ భూభాగమేనని సూటిగా, చెంపదెబ్బ కొట్టేలా” సమాధానం చెప్పారు సుష్మా. గాజుమేడలో ఉండి రాళ్లు విసిరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పాకిస్థాన్ కు హితవు పలికారు.

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గత సమావేశాల్లో ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ… జమ్మూకాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారని, ఇప్పుడు ఆయనను సూటిగా అడుగుతున్నా… “బలూచిస్థాన్ లో ఏం జరుగుతోంది? సాక్ష్యాలు ప్రపంచానికి చూపించాలా?” అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. భారత్ షరతులు పెడుతోందని, చర్చల ప్రక్రియ ముందుకు సాగడం లేదని పాకిస్థాన్ పదేపదే ఆరోపిస్తోంది.

లాహోర్ నుంచి నవాజ్ షరీఫ్ భారత్ కు రావడానికి ఏ షరతులు పెట్టామో వెల్లడించాలి, అలాగే భారత్ లో కూర్చుని చర్చించినప్పుడు ఏ షరతులతో చర్చించామో చెప్పాలని నిలదీశారు. భారత్ ఎప్పుడు స్నేహహస్తం చాచినా, పాకిస్థాన్ కుటిలబుద్ధిని బయట పెట్టుకుంటోందని, మోడీ ఏ షరతులు పెట్టి లాహోర్ వచ్చారని, ఏ షరతులుపెట్టి గతంలో క్రికెట్ ఆడామని, ఏ షరతులతో గత ఒప్పందాలను గౌరవిస్తున్నామని న్యూయార్క్ వేదికగా కడిగిపడేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం కారణంగా ప్రపంచానికి జరుగుతున్న నష్టాన్ని ఐక్యరాజ్యసమితికి గుర్తు చేశారు.

ఉగ్రవాదులను ఎవరు తయారు చేస్తున్నారని? ప్రశ్నించిన సుష్మా, ప్రపంచం మొత్తం ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలని సూచించారు. ఉగ్రవాదుల చేతికి ఆయుధాలు ఎవరిస్తున్నారు? ఉగ్రవాదులకు నిధులు ఎవరు సమకూరుస్తున్నారు? ఉగ్రవాదులను ఎవరు దాడులకు పురికొల్పుతున్నారు? అన్నెం, పున్నెం ఎరుగని అమాయకులను ఉగ్రవాదులు ఎందుకు పొట్టన పెట్టుకుంటున్నారు? దీని వెనుక ఉన్న స్వార్థ రాజకీయాలేంటి? అని నిలదీశారు.

కులం, మతం, ప్రాంతం, రంగు ఇలా తేడాలు లేకుండా ఉగ్రవాదులు ప్రపంచాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన స్వరాజ్, దీనంతటికీ కారణం ఏంటి? అని ప్రపంచాన్ని ప్రశ్నించారు. తాను చెప్పే కొన్ని విషయాలు ఐక్యరాజ్యసమితిలో కొన్ని దేశాలకు నచ్చవని, ఉగ్రవాదులపై ప్రపంచం మొత్తం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం ఏకమై వారిపై దాడులు చేయాల్సిన అవసరం ఉందని, కొన్ని దేశాలకు నచ్చినా, నచ్చకపోయినా ఇందులో భాగస్వామ్యం కావాల్సిందేనని స్పష్టం చేశారు.

ఉగ్రవాదులపై ప్రపంచ దేశాలు ఏకమై పోరాడని పక్షంలో ప్రపంచం తీవ్రంగా నష్టపోతుందని, ఉగ్రవాదులపై దాడులకు ఏ దేశమైనా అంగీకరించకపోతే దానిని ఏకాకిని చేయాల్సిన తరుణమిదేనని సూచించారు. అలాంటి దేశాన్ని ఉగ్రదేశంగా ప్రకటించాలని, ఆ దేశం ఉగ్రవాదులను ఉత్పత్తి చేస్తుంది కనుక వారిపై దాడులకు అంగీకరించదని, ఇతర దేశాలపై దాడులకు చేసేందుకు ఆ దేశం ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు సమకూరుస్తుందని, అనంతరం ప్రపంచంపైకి వారిని దాడులకు పురికొల్పుతుందని, అలాంటి దేశానికి ప్రపంచంలో ఎక్కడా స్థానం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.

“పాకిస్థాన్ ప్రధానికి చెబుతున్నా… యూరీ సెక్టార్ లో జరిగినది ఏంటి? బుర్హాన్ వనీ ఘటనలో ఏం జరిగింది? అందుకు సంబంధించి సజీవ సాక్ష్యాలున్నాయి. ప్రపంచానికి చూపేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధమే” అని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఇలాంటి ఘటనలు చేస్తూ, బెదిరింపులకు దిగుతూ ఏదో చేద్దామని ప్రయత్నిస్తే…. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

చివరగా… పాకిస్థాన్ కు చెబుతున్నా… కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం… అది ఎప్పటికీ భారత్ దే… భారత్ లోనే ఉంటుంది… అంటూ గళమెత్తిన సుష్మా స్వరాజ్ స్వరానికి దేశాభిమానులు ‘సలాం’ చేస్తున్నారు.