pakistan ICC champions trophy 2017చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ పై ఓడిన పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పాక్ ఓటమి సిగ్గుచేటని, అవమానకరమని ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం నాడు ఎడ్జ్‌ బాస్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 319 పరుగులు చేయగా, అనంతరం భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 164 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

పాక్ ఓటమిపై మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ… గెలుపోటములు ఏ ఆటలోనైనా సహజమే గానీ, అయితే ఆదివారం నాటి మ్యాచ్‌లో పాక్ పోరాడకుండానే ఓడిపోవడం బాధ కలిగించిందని పేర్కొన్నాడు. బోల్డంత సత్తా ఉన్నప్పటికీ పోరాడకపోవడం బాధాకరమని, జట్టులో సమూల మార్పులు చేయకపోతే, భారత్ చేతిలో ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటుందని పేర్కొన్నాడు.

మాజీ కెప్టెన్ వసీం అక్రం మాట్లాడుతూ… పాకిస్థాన్ 15 మందితో బరిలోకి దిగినా ఇంతకంటే గొప్ప ఫలితం వస్తుందని తాను భావించడం లేదంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు. భారత్-పాక్‌ జట్లలో ఉన్న తేడా ఏంటో ఈ మ్యాచ్‌ తో తేటతెల్లమైందని అన్నాడు. ఇక బూమ్ బూమ్ షాహిద్ అఫ్రిది స్పందిస్తూ… కాలం గడుస్తున్న కొద్దీ భారత్-పాక్‌ జట్ల మధ్య అంతరం పెరుగుతోందని, భారత్ దూసుకుపోతుండగా, పాక్ వెనకబడిపోతోందని అన్నాడు.

టీమిండియాను ఓడించే సత్తా పాకిస్థాన్‌ కు లేదన్న విషయాన్ని పాక్ మీడియా ప్రచురిస్తే బాగుంటుందని మాజీ కెప్టెన్ అమీర్ సోహైల్ సలహా ఇచ్చాడు. ఇంగ్లీష్ పిచ్‌ లపై బంతి తిప్పలేని స్పిన్నర్లతో బరిలోకి దిగడం సరికాదని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. గతంలో భారత్ చేతిలో పాక్ ఓడడం కంటే తాజా ఓటమి పాక్ అభిమానులను కుదురుకోనీయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడం పాక్ అభిమానులను కలచివేస్తోంది.